సాక్షి, హైదరాబాద్ : సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదని, జాతీయ చానెల్ స్క్రోలింగ్ చూసి అందరూ నిజమనుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. రోజూ న్యూస్ ఛానెల్స్లో ఏ అంశంపై చర్చ జరగాలనేది బీజేపీ నిర్ణయిస్తుందని, 2019లో మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు ప్రధాని అనే అంశంపై చర్చ నడిపించాలని బీజేపీ యోచిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీకి పలు అంశాల్లో సీఎం కేసీఆర్ సాయం చేశారని అన్నారు. మధుయాష్కీ బుధవారం మీడియాతో చిట్చాట్ చేస్తూ కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు.
రాహుల్ విదేశీ పర్యటనల ప్రబావం ఏంటో పార్లమెంట్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే అర్ధమవుతుందన్నారు. ఇక రాష్ట్రాల్లో పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ పొత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు విశ్వసనీయతే లేదని, రాజ్యసభలో వారికి ఎంపీలే లేరని తాము బీజేపీ సభ్యులను ఒప్పించి బిల్లు పాస్ అయ్యేలా చూశామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా ఉద్యమ సమయంలో కూడా కిరణ్కుమార్ రెడ్డి సమర్ధవంతంగా పాలించాడని కితాబిచ్చారు.