ప్రధాని మోదీకి ఎంపీ ముఖ్యమంత్రి సవాల్‌!

21 Feb, 2020 16:11 IST|Sakshi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ​ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను రాజకీయంగా వాడుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దాడికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. భారత సైన్యంపై తనకు ఎనలేని గౌరవం ఉందని, అదే సమయంలో కేంద్ర వైఖరిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. మీడియాలో వచ్చిన కథనాలను నమ్మలేమని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ను చేపట్టామని చెప్పుకుంటున్న కేంద్రం ఇంతవరకు ఫోటో, గణాంక ఆధారాలను ఎందుకు బయటపెట్టలేదని విమర్శించారు. అంతా మీడియాలో గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

కాగా, ఉరి సెక్టార్‌లోని భారత ఆర్మీ స్థావరాలపై 2016లో పాకిస్థాన్‌ టెర్రరిస్ట్‌లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపట్టింది. పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పింది. ఇక గతేడాది పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన బాలాకోట్‌పై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. జైషే శిక్షణా శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులను భారత వాయుసేన దళాలు మట్టుబెట్టాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, బాలాకోట్‌ దాడులకు సంబంధించి కూడా పక్కా ఆధారాలు లభించలేదు. ఉరి ఘటన.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘ఉరి’ ఘన విజయం సాధించింది.

చదవండి: సీఎంపై విచారణకు హోంశాఖ ఆమోదం

మరిన్ని వార్తలు