మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వేదిక నుంచి జారి పడిపోయారు. జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం ఛటర్పూర్ జిల్లా చంద్లా నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రసంగం ముగిశాక వేదికపై నుంచి కిందికి దిగే క్రమంలో జారి పడిపోయారు. అయితే అప్రమత్తమైన కార్యకర్తలు, సిబ్బంది ఆయన్ని కిందపడకుండా పట్టుకున్నారు. దీంతో ఎలాంటి గాయం లేకుండా ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మెట్టు అనుకుని పక్కకు ఆయన కాలేయటంతోనే ఇది జరిగిందని, ఆయనకేం కాలేదని వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. కాగా, మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్.. వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు.