కూటమి భవిష్యత్తుపై అజిత్‌ కీలక ‍ప్రకటన

21 Dec, 2019 17:21 IST|Sakshi

జెడ్పీ ఎన్నికల్లో మహా వికాస్‌ ఆఘాడి పోటీ

సాక్షి, ముంబై: భవిష్యత్తులో జరిగే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేయాలని శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడి నాయకులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై మూడు పార్టీల ప్రముఖులు ఆమోద ముద్రవేశారు. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శదర్‌ పవార్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బాలాసాహెబ్‌ థోరాత్‌లు జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన అజీత్‌ పవార్‌ అసెంబ్లీ హాలు బయట విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా జిల్లా పరిషత్‌ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. వచ్చే ఎన్నికల్లో మహా వికాస్‌ ఆఘాడి కలిసే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వివిధ జిల్లాల్లోని స్థానిక పరిస్థితులను పరిశీలించి అక్కడి నేతలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పవార్‌ అన్నారు.

మరిన్ని వార్తలు