ముఖ్యమంత్రి ఎవరు?

26 Oct, 2019 09:15 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. బీజేపీ, శివసేనల కూటమికి పూర్తి మెజార్టీ లభించినప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ ఏర్పడింది. ముఖ్యంగా తమకు అధికారంలో సమాన వాటా కావాలని ఇది తేల్చుకున్నాకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయా అనే అంశంపై కూడా ఊహగానాలు ప్రారంభమయ్యాయి. 

ఎన్నికల ఫలితాల వెలుపడక ముందునుంచే బీజేపీ 220కి పైచిలుకు తమకు స్థానాలు దక్కుతాయంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు తారుమారయ్యాయి. ముఖ్యంగా గతంలోకంటే 17 స్థానాలు తగ్గినప్పటికీ బీజేపీ 105 స్థానాలతో అతిపెద్ద పారీ్టగా అవతరించిన ఆశాభంగం కావడంతో నిరాశకు గురైంది. మరోవైపు శివసేన గతంలోకంటే ఆరు స్థానాలు తగ్గిన సంగతి తెలిసిందే. 56 స్థానాలు లభించినప్పటికీ శివసేనలో మాత్రం ఉత్సాహం కని్పస్తోంది. ఎందుకంటే తాము లేనిదే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదన్న ధీమా శివసేనలో కని్పస్తోంది. 

భావి ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే? 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం సమాన వాటా ఇచ్చిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించిన అనంతరం శివసేనలో కొత్త ఉత్సాహం కని్పస్తోంది. ముఖ్యంగా బీజేపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే రెండున్నరేళ్లు బీజేపీ, రెండున్నరేళ్లు శివసేనలకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని అదేవిధంగా మంత్రి పదవులలో కూడా కీలక శాఖలు శివసేనకు దక్కుతాయని శివసేన నేతలు, కార్యకర్తలలో ఆనందం వ్యక్తమవుతోంది.

ఇలాంటి నేపథ్యంలో ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా ముంబై వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన దివంగత బాల్‌ ఠాక్రే మనుమడైన యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రిగా అవుతారన్న ఊహగానాలకు ఊతం వచ్చింది. శివసేనకు చెందిన కార్యకర్తలు ముంబైలో భావి ముఖ్యమంత్రి అంటూ ఆదిత్య ఠాక్రే హోర్డింగులు కూడా ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచే ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అనేక ప్రాంతాల్లో ఈ అంశాన్ని శివసేన నేతలు కూడా ప్రకటించారు. అయితే ఫలితాల అనంతరం మాత్రం ఆదిత్య ఠాక్రే భావి ముఖ్యమంత్రిగా పేర్కొంటున్నారు.  

దేవేంద్ర ఫడ్నవిస్‌ ఐదేళ్లు కొనసాగేనా? 

శివసేన వైఖరిపై బీజేపీ ఎలా స్పందించనుందనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ కని్పస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి మళ్లీ దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు మళ్లీ ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఎన్నికల ప్రచారంలో కూడా పలుమార్లు దేవేంద్ర ఫడ్నవిస్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో శివసేన వైఖరిపై బీజేపీ ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవిస్‌ ఎలా స్పందించనున్నారనే విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కీలక మంత్రి పదవులతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చి శివసేనకు ముఖ్యంగా ఉద్ధవ్‌ ఠాక్రే నచ్చచెప్పి తానే ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు ఒక అడుగు వెనక్కి వేసి ముఖ్యమంత్రి పదవి మాత్రం ఒక సంవత్సరం లేదా తప్పనిసరి పరిస్థితిలో రెండున్నరేళ్లు శివసేనకు కట్టబెడతారనే విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఓ వైపు శివసేన తన వైఖరిని స్పష్టం చేసింది. దీంతో తొందర్లోనే ఈ విషయంపై బీజేపీ ఎలాంటి ప్రకటనలు చేయనుందనే వేచిచూడాల్సిందే. మరోవైపు మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం బీజేపీకి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అయితే తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలు తన సంప్రదింపుల్లోనే ఉన్నారని దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటించారు. దీంతో వీరితో పాటు మరో 24 మందిని ఎలాగైన తమవైపు తిప్పుకుని బీజేపీ ఒంటరిగా అధికారం చేపట్టే అవకాశాలు లేకపోలేదని కొందరు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఊహించినంత సాధ్యం కాదని తెలిసిందే. కాగా, శివసేనకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలాసాహెబ్‌ థోరాట్‌ ప్రకటించారు. కానీ మాతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన సిద్ధం కావాలన్నారు.  

మారేనా రాజకీయ సమీకరణాలు? 

రాష్ట్రంలో ఎన్నికల పలితాల అనంతరం అనేక ఊహగానాలకు ఊతం వచి్చంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో రాజకీయ సమీకరరణాలు మారే అవకాశాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అధికారంలో సమాన వాటా ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి రెండున్నరేళ్లపాటు ఇచ్చేందుకు అంగీకరించనట్టయితే పరిస్థితి మారే అవకాశాలైతే ఉన్నాయని చెప్పవచ్చు. ఓ వైపు అధికారం 50:50 వాటా ఒప్పందం తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన ప్రకటించడం, మరోవైపు శివసేనకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్‌ ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు వేడేక్కడంతోపాటు రాజకీయ సమీకరణాలు మారేనా అనే విçషయంపై అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్‌ మద్దతును శివసేన తీసుకోకపోవచ్చని అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసి బీజేపీతోనే కొనసాగుతుందని, మరోవైపు బీజేపీ కూడా శివసేనను ఎలాగైన ప్రసన్నం చేసుకుంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు