సీఎల్పీ మాజీనేతకి మంత్రిపదవి

16 Jun, 2019 15:58 IST|Sakshi

మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ

విఖే రాథాకృష్ణ పాటిల్‌కు అవకాశం

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కాంగ్రెస్ మాజీ నేత విఖే రాథాకృష్ణ పాటిల్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది.  కాంగ్రెస్ శానససభా పక్ష నేతగా మొన్నటివరకూ వ్యవహరించిన విఖే పాటిల్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఫడ్నవిస్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పాటిల్‌తో పాటు ఆశిష్ షెలార్ కొత్త ‌మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 13 మంది మంత్రులకు ఫడ్నవిస్‌ అవకాశం కల్పించగా.. వారిలో 10 మంది బీజేపీ ఇద్దరు శివసేన ఒకరు ఆర్‌పీఐ నుంచి ప్రాతినిథ్యం పొందారు.

పదిమంది బీజేపీ మంత్రుల్లో ఆరుగురికి కేబినెట్ హోదా, నలుగురికి సహాయ మంత్రుల హోదా ఇచ్చారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో కొత్త మంత్రులందరి చేత గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫడ్నవిస్ తన కేబినెట్‌ను విస్తరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ముందు జరుగనున్న ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలే ఆసారికి చివరి సమావేశాలు కానున్నాయి.

>
మరిన్ని వార్తలు