నేడే ఎన్నికలు

21 Oct, 2019 03:37 IST|Sakshi
మహారాష్ట్రలోని సాంగ్లీలో ఎన్నికల సామగ్రితో బురదలోనే నడిచి వెళ్తున్న అధికారులు సిబ్బంది

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలకు పోలింగ్‌

18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ సీట్లతోపాటు రెండు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు

ముంబై/చండీగఢ్‌: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నేడు జరగనున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు ఎన్నికలు, 18 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ సీట్లకు, రెండు లోక్‌సభ స్థానాల(సతారా, సమస్తిపూర్‌)కు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఇందుకోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తు కోసం మహారాష్ట్రలో 3 లక్షల మందిని, హరియాణాలో 75 వేల మంది పోలీసులను మోహరించారు.  

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ప్రచారంలో బీజేపీ పైచేయి సాధించగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలు వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకుగాను ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ అంశాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారంలో వాడుకుంది.  దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యంపై కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేశారు.

ఉప సమరం జరిగే రాష్ట్రాలు..
యూపీలో 11, గుజరాత్‌ 6, బిహార్‌ 5, అస్సాం 4, హిమాచల్‌ ప్రదేశ్‌ 2, తమిళనాడు 2, పంజాబ్‌ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్తాన్‌ 2, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు..మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్తిపూర్‌ లోక్‌సభ స్థానాలకు కూడా నేడు పోలింగ్‌ జరగనుంది.
బరిలో ప్రముఖులు

మహారాష్ట్రలో: బీజేపీకి చెందిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ (నాగ్‌పూర్‌–నైరుతి),  కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రులు అశోక్‌ చవాన్‌ (భోకర్‌), పృథ్వీరాజ్‌ చవాన్‌ (కరాడ్‌)  శివసేనకు చెందిన ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (వర్లి)
 

హరియాణాలో: సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (కర్నాల్‌), కాంగ్రెస్‌ మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హూడా (గర్హి సంప్లా–కిలోయి), రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా (కైతాల్‌), కుల్దీప్‌ బిష్ణోయి (ఆదమ్‌పూర్‌), దుష్యంత్‌ చౌతాలా (ఉచన్‌కలాన్‌)   

విపక్షమే లేనప్పుడు అన్ని ర్యాలీలా: సేన
రాష్ట్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీనిచ్చే ప్రతిపక్షమే లేదంటూనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు పదుల సంఖ్యలో ర్యాలీలు నిర్వహించడం ఎందుకంటూ బీజేపీని మిత్రపక్షమైన శివసేన నిలదీసింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ రాసిన వ్యాసంలో.. ‘ఎన్నికల ప్రచార పర్వంలో తమకు పోటీ ఇచ్చే ప్రతిపక్షమే లేదని సీఎం అంటున్నారు.  అలాంటప్పుడు ప్రధాని 10, హోం మంత్రి 30, సీఎం  100 ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నట్లు?’ అని ప్రశ్నించారు.

ఈ ఎన్నికల్లో ఎన్నో ఫస్ట్‌లు
మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి ఎన్నికల్ని వివిధ కోణాల నుంచి చూస్తే ఎన్నో ఫస్ట్‌లు కనిపిస్తాయి.

► 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగే తొలి ఎన్నికలివి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్‌ చెక్కు చెదరని నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

► కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. కశ్మీర్‌ అసెంబ్లీ అనుమతి లేకుండా రాష్ట్రాన్ని విభజించారన్న విమర్శలు వచ్చినప్పటికీ, రావణకాష్టంలా రగులుతున్న సమస్యకు ఏదో ఒక పరిష్కారం వచ్చిందనే అభిప్రాయమైతే జనంలో కనిపించింది. అందుకే ఈసారి ప్రచారంలో స్థానిక అంశాలను పట్టించుకోకుండా ఆర్టికల్‌ 370 రద్దునే ప్రధాని మోదీ ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. జాతీయ భావాన్ని రగిల్చి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు.

► ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలివి. బీజేపీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన చర్య ఇది. దీని ప్రభావం ముస్లిం ఓటర్లపై ఎలా పడుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలతో ముస్లింలు, ముఖ్యంగా మహిళా ముస్లింలను బీజేపీ ఏ మేరకు ఆకర్షించగలదో తేలిపోనుంది.

► 2014 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థులు ఎవరో ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది. గెలిచిన తర్వాత అనూహ్యంగా మరాఠాల ఆధిపత్యం ఉన్న మహా రాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌ను, జాట్‌ల ప్రాబల్యం ఉన్న హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌ను సీఎంలుగా చేసింది. ఇప్పుడు వారే సీఎంలుగా ఎన్నికలకు వెళుతోంది. మరి మరాఠా, జాట్‌ల దారి ఎటో తెలిసిపోతుంది.

► ఇక కాంగ్రెస్‌ పార్టీ పరంగా చూస్తే అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలివి. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో పార్టీపై దృష్టిపెట్టలేక పోతున్నారు. దశ, దిశను నిర్దేశించే నాయకత్వలేమితో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు ఇంకెన్ని చేదు అనుభవాలను మిగల్చబోతున్నాయో !

విపక్షమే లేనప్పుడు అన్ని ర్యాలీలా: సేన
రాష్ట్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీనిచ్చే ప్రతిపక్షమే లేదంటూనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు పదుల సంఖ్యలో ర్యాలీలు నిర్వహించడం ఎందుకంటూ బీజేపీని మిత్రపక్షమైన శివసేన నిలదీసింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ రాసిన వ్యాసంలో.. ‘ఎన్నికల ప్రచార పర్వంలో తమకు పోటీ ఇచ్చే ప్రతిపక్షమే లేదని సీఎం అంటున్నారు.  అలాంటప్పుడు ప్రధాని 10, హోం మంత్రి 30, సీఎం  100 ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నట్లు?’ అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు