గెలుపుపై ఎవరి ధీమా వారిదే

11 Dec, 2018 01:40 IST|Sakshi

హోరాహోరీ పోరులో కరీంనగర్‌ హేమాహేమీలు 

ఈటల, కేటీఆర్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం భవితవ్యం తేలేది నేడే..

ఓటింగ్‌ సరళి, పెరిగిన ఓట్లు ఎవరికి చేటు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు కరీంనగర్‌ జిల్లా ఉద్దండులు మంగళవారం వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమ భవిష్యత్‌ను తేల్చుకోబోతున్నారు. వీరిలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, మాజీ విప్‌ కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, మాజీ విప్‌ ఆరెపెల్లి మోహన్, బీజేపీ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బండి సంజయ్‌ తదితరులు  ఉన్నారు. కొందరి గెలుపోటములు, మరికొందరి మెజార్టీ హెచ్చుతగ్గులపై జోరుగా చర్చ, బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.  

హ్యాట్రిక్‌ వీరులు, డబుల్‌ హ్యాట్రిక్‌ రేసు  
ఈటల రాజేందర్‌ 2004 ఎన్నికలు, 2008 ఉపఎన్నికల్లో కమలాపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత హుజూరాబాద్‌ నుంచి 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో సత్తాచాటారు. తాజాగా గెలిచిస్తే డబుల్‌ హ్యాట్రిక్‌ సాధిం చినట్లు అవుతుంది. తాజా మాజీ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌  మేడారం నుంచి  టీడీపీ తరఫున 1994లో పోటీ చేసి ఓటమిపాలుకాగా, 2004, 2008లో రామగుండం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత ధర్మపురి నుంచి 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో విజయం సాధించారు. ఈసారి గెలిచి డబు ల్‌ హ్యాట్రిక్‌ సాధించాలని కలలు గంటున్నారు. 2009, 2010 (ఉపఎన్నిక), 2014 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ రమేశ్‌బాబు, మంత్రి కేటీఆర్‌ నాలుగోసారి(సిరిసిల్ల) గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో గెలిచారు. గతంలో ఒకసారి మెట్‌పల్లిలో ఓడిపోయారు. ఈసారి ఐదో ప్రయత్నంగా పోటీకి సై అంటు న్నారు. మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌నేత శ్రీధర్‌బాబు 1999, 2004, 2009 ఎన్నికల్లో మంథని నుంచి వరుసగా గెలిచారు. 2014లో ఓటమి చెందిన ఆయన ఇప్పుడు ఐదోసారి పోటీ చేశారు. 1999లో పెద్దపల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి తర్వా త నాలుగుసార్లు ఓటమి చెంది..  ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.   

పదోసారి బరిలో జీవన్‌రెడ్డి 
జగిత్యాల తాజా మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి పదోసారి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. టీడీపీ నుంచి మొదటగా1983లో గెలిచారు. 1989, 1996 (ఉపఎన్నిక), 1999, 2004, 2014లో విజయం సాధించగా.. 1985, 1994, 2009 ఎన్నికల్లో ఓటమి చెందారు. గంగుల కమలాకర్‌(కరీంనగర్‌) హాట్రిక్‌ కోసం  యత్నిస్తున్నారు. కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ రెండోసారి కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 

మరిన్ని వార్తలు