ఏడుగురు సిట్టింగ్‌లతో మజ్లిస్‌ తొలిజాబితా

12 Sep, 2018 02:40 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ– ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందుగానే ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం ప్రకటించింది. ప్రకటించిన జాబితాలో ఏడుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మరోమారు అవకాశం కల్పించింది. ఇద్దరు సిట్టింగ్‌లకు స్థానాలు మార్పు చేయగా, ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలను యథాతథం స్థానాలకు ఖరారు చేసింది.

చార్మినార్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీని యాకుత్‌పురా నియోజకవర్గానికి, యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను చార్మినార్‌ నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, బహదూర్‌పురాకు ముహమ్మద్‌ మోజం ఖాన్, మలక్‌పేటకు అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల, నాంపల్లికి జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్, కార్వాన్‌కు కౌసర్‌ మొహియుద్దీన్‌ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. వారం రోజుల్లో మరో జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు