వేదికపై కేటీఆర్‌.. ఆనందంతో గంతులేసిన మల్లారెడ్డి

22 Nov, 2018 13:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి తనదైన వ్యవహారశైలితో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ కాలేజ్‌ల్లో ఆయన చేసే ప్రసంగాలు, డ్యాన్సులకు విద్యార్థులను  విపరీతంగా ఆకట్టుకుంటాయి. యువతను ఉత్తేజ పరిచేలా ఆయన చేసే సరదా వ్యాఖ్యలు పలుమార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇటీవల మల్లారెడ్డికి కార్యకర్తలు చేసిన పాలాభిషేకం వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలిచారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా  ధూలపల్లిలోని మల్లారెడ్డి కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అపద్ధర్మ మంత్రి కేటీఆర్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు పాల్గొన్నారు. కేటీఆర్‌ వేదికపైకి చేరుకున్నఅనంతరం.. ఆనందంతో అక్కడున్నవారికి అభివాదం చేసిన మల్లారెడ్డి.. విజయకేతనం చూపుతూ.. చిన్నగా గంతులేశారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. మల్లారెడ్డి చర్యతో కేటీఆర్‌ కూడా ముఖంలో నవ్వుని ఆపుకోలేకపోయారు కేటీఆర్‌ ప్రసంగం తర్వాత మైక్ అందుకున్న మల్లారెడ్డి తనదైన డైలాగ్‌లతో చెలరేగారు. మధ్యలో కేటీఆర్‌ వారించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన తన మార్కు ప్రసంగాన్ని కొనసాగించారు.

మరిన్ని వార్తలు