వైఎస్సార్ సీపీ నేత మళ్ల విజయప్రసాద్ ఆరోపణ
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అందిస్తుంటే.. లింగమనేని నిర్మాతగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యాక్టింగ్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ విశాఖ నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్ విమర్శించారు. టీడీపీ వ్యతిరేక ఓట్లు వైఎస్సార్ సీపీకి రాకుండా ఉండేందుకే పవన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం రాజ్యాంగ ఆవిష్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ ఐదు కిలోమీటర్లు నడిస్తే అపసోపాలు పడతారని అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం మూడు వేల కిలోమీటర్లకుపైగా నడిచారని తెలిపారు. పవన్ ఇల్లు నిర్మించిన స్థలం లింగమనేనిది కాదా అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక భవనాల పేరిట కోట్ల రూపాయలు వృథా చేస్తున్న పవన్ నోరు మెదపరని మండిపడ్డారు. బాక్సైట్ కోసం మాట్లాడే అర్హత పవన్ లేదన్నారు. నాడు గిరిజనులు నష్టపోతారని వైఎస్సార్ బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తే.. ఇప్పుడు వైఎస్ జగన్ చింతపల్లిలో సభ పెట్టి గిరిజనులకు బాసటగా నిలిచారని అన్నారు. జననేతపై అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు ఎంవీవీ సత్యనారాయణ, రమణ మూర్తి, శ్రీనివాస్ వంశీకృష్ణ, నాగిరెడ్డి, అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాద్రెడ్డి, జాన్ వెస్లీ, మహిళ విభాగం ప్రతినిధి షీలా వెంకట లక్ష్మీ, నాయకులు కొండా రాజీవ్, శ్యామ్ కుమార్రెడ్డి, బోని శివరామకృష్ణ, పక్కి దివాకర్లు పాల్గొన్నారు.