‘మండలి చైర్మన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’

23 Jan, 2020 11:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ : చట్టానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షనేత చంద్రబాబు కనుసన్నల్లో శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ వ్యవహరించారని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. చంద్రబాబు గతంలో కోడెలను శాసనసభకు, మండలి చైర్మన్‌కు షరీఫ్‌ను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని మంట కలిపారని మండిపడ్డారు. గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలు మారిన వారికి మంత్రి పదవులు ఇచ్చి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తమను మట్లాడకుండా గొంత నొక్కారని విమర్శించారు. నిబంధనలు పాటించకుండా చైర్మన్‌ విచక్షణ అధికారం అని ప్రజాస్వామ్యాన్ని అపహప్యం చేశారని వ్యాఖ్యానించారు. తప్పు జరిగింది. చంద్రబాబు చెప్పారు.. చెస్తున్నా.. అన్నట్లు మాట్లాడిన చైర్మన్‌ మాటలను తప్పు పట్టారు.

ఏపీ ప్రజలు ఆకాంక్షించే బిల్లులను వ్యతిరేకిస్తున్నారని,చట్టసభలను జిగుచ్చాకరంగా మార్చారని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. లోకేష్‌పై మంత్రులు దాడి చేశారనడం అసత్యమని, చైర్మన్‌ను దూషించడం.అబద్దామని పేర్కొన్నారు. మండలి చైర్మన్‌ న్యాయ పక్షాన కాకుండా అన్యాయ పక్షాన నిలిచారని ఆరోపించారు. ప్రజలు చివరి అస్త్రంగానే ఓట్లు వేసి బాబును ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం వారు ఏ రోజైనా ప్రజలకు కావాల్సింది కాకుండా చంద్రబాబుకు కావాల్సిందే అడిగుతున్నారని విమర్శించారు. టీడీపీకి రాబోయే కాలంలోనూ ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. అన్ని ప్రాంతాల అభిృద్ధి కావాలనేదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు