‘కూటమి దెబ్బకి కేటీఆర్‌ మైండ్‌ బ్లాక్‌’

14 Nov, 2018 19:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ప్రజా కూటమి దెబ్బకి ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ మైండ్‌ బ్లాక్‌ అయ్యిందని కాంగ్రెస్‌ ప్రచార కమిటి చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో భట్టి చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటు సాధ్యం కాదనుకున్న టీఆర్‌ఎస్‌కు ప్రజాకూటమి ఏర్పాటుతో దిమ్మతిరిగిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 75నుంచి 80 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం నుంచి తమ ప్రచారాన్ని వేగవంత చేస్తామన్నారు.

మొత్తం 10 సభలలో సోనియా రాహుల్‌ గాంధీలు పాల్గొంటారని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేయడం ఖాయమన్నారు. కూటమితో కలిసి పనిచేస్తూ అవగాహనతో ముందుకు వెళ్తామన్నారు. అధికారం, సంపద, వనరులు నాలుగు కోట్ల మందికి పంచాలనేదే కూటమి లక్ష్యం అని తెలిపారు. టికెట్ల విషయంలో సాధ్యమైనంత వరకు సామాజిక న్యాయం పాటిస్తామన్నారు. ఎవరికైతే టికెట్లు రావో వారికి భవిష్యత్‌లో సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని భట్టి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు