‘లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం’

23 Aug, 2018 17:15 IST|Sakshi
మల్లు భట్టివిక్రమార్క(పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రచార ఆర్భాటంతో రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నాగరాజు అనే వ్యక్తికి సెంట్‌ భూమి లేకున్నా.. అతని ఫొటోలతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.. రైతు భీమా పథకానికి సంబంధించిన ప్రకటనల్లో అతని భార్య ఫొటోలను కూడా వాడారని గుర్తు చేశారు. 

తీరా కంటి వెలుగు పథకానికి సంబంధించిన ప్రకటనల్లో నాగరాజు భార్య ఫొటోతో ఆమె భర్తకు బదులు వేరే వారి ఫొటోను ప్రచురించడంతో.. ఆవేదన చెందిన ఆమె న్యాయం కోసం తమను ఆశ్రయించిందన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెబుతున్న కేసీఆర్‌ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సర్కార్‌ సొమ్ముతో చెయ్యని పనులను చేసినట్టుగా కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
 

మరిన్ని వార్తలు