బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

21 Jun, 2018 15:43 IST|Sakshi
ప్రధాని మోదీ.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. భాజాపాను ఓ ఉగ్రవాద సంస్థగా అభివర్ణించారు. ‘మా పార్టీ(టీఎంసీ పార్టీ) బీజేపీలా కాదు. క్రైస్తవులు, ముస్లింలతోపాటు హిందువుల మధ్య కూడా వాళ్లు(బీజేపీ) చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని యత్నిస్తున్నారు’ అంటూ మమతా వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య దాడులు-ప్రతిదాడులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కార్యకర్తల అనుమానాదాస్పద మృతులతో ఇరు పార్టీలు ‘రాజకీయ హత్యలు’గా పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. 

ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ టీఎంసీ పార్టీ నేతలను, కార్యకర్తలను బెదిరించారు. గతవారం జల్‌పైగురిలో నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శన సందర్భంగా ‘రౌడీయిజానికి పాల్పడితే టీఎంసీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయిస్తానని, ఎన్‌కౌంటర్‌ చేయిస్తానని’ దిలీప్‌ బహిరంగంగా వ్యాఖ్యాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మమతా ఇలా తీవ్రంగా స్పందించారు. మరోపక్క తీవ్ర వ్యాఖ్యలకుగానూ దిలీప్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ, టీఎంసీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

                                                మమతా బెనర్జీ.. దిలీప్‌ ఘోష్‌

>
మరిన్ని వార్తలు