బీజేపీ ఫలితాలపై మమత జోస్యం

17 May, 2019 10:37 IST|Sakshi

ఏపీ, తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవదు

 దేశ వ్యాప్తంగా 100 స్థానాలకే పరిమితం

కోల్‌కత్తా: బెంగాల్‌లో బీజేపీ-తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈపోరులో  విజయంపై ఎవరికివారే ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ఫలితాలపై బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ జ్యోస్యం చెప్పారు. గురువారం ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘దేశ వ్యాప్తంగా బీజేపీకి పరాభావం తప్పదు. ముఖ్యంగా దక్షిణాదిన దారుణమైన ఫలితాలను చవిచూస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో కనీసం ఖాతా కూడా తెరవదు. మహారాష్ట్రలో 20, దేశ వ్యాప్తంగా 200 స్థానాలను కొల్పోతుంది’’ అని తన సర్వే ఫలితాలను మమత వెల్లడించారు.

బెంగాల్‌లో ఓట్ల కోసం బీజేపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేశారని,  తమ పార్టీని కార్యకర్తలను బెదిరిస్తూ.. గుండాల్లా ప్రవర్తించారని దీదీ ఆరోపించారు. తన బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల తనపై తప్పుడు ఆరోపనలు చేసిన వారందరనీ జైలుకీడుస్తానని హెచ్చరించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గురువారమే ప్రచారాన్ని ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే.  బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్‌ జరగనుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో దానిని పశ్చిమ బెంగాల్‌లో మాత్రం గురువారం రాత్రికి కుదిస్తూ ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


 

మరిన్ని వార్తలు