మోదీకి దీదీ ‘స్వీట్‌’ వార్నింగ్‌

26 Apr, 2019 17:48 IST|Sakshi

కోల్‌కతా : మమతా బెనర్జీ తనకు ఏటా స్వీట్లు పంపుతారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించడంపై పశ్చిమ బెంగాల్‌ సీఎం భగ్గుమంటున్నారు. ఈసారి తాను ప్రధానికి ఇసుక, గులకరాళ్లతో తయారుచేసిన స్వీట్లను పంపుతానని దీదీ ఘాటుగా హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె అసన్‌సోల్‌లో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ తాను ప్రధాని మోదీకి బెంగాల్‌ రసగుల్లాలు పంపుతుంటానని, కానీ ఈసారి లడ్డులో జీడిపప్పు, బాదం వాడినట్టుగా ఇసుక, గులకరాళ్లతో చేసిన స్వీట్స్‌ పంపుతానని..దీంతో ఆయన పళ్లు ఊడటం ఖాయమని అన్నారు.

ఇక ఇదే పట్టణంలో గతవారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన మోదీ ప్రధాని పదవి వేలం వేయరని దీదీకి చురకలు వేసిన సంగతి తెలిసిందే. కాగా సినీ నటుడు అక్షయ్‌ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ తనకు ఏటా స్వీట్స్‌, బహుమతులు పంపుతుంటారని, ఆమె ఇప్పుడు కూడా ఏటా రెండు కుర్తాలు పంపుతుంటారని చెప్పడంతో దీదీ దీటుగా బదులిచ్చారు. స్వీట్లు, బహుమతులతో స్వాగతించడం బెంగాల్‌ సంస్కృతి అని, బెంగాల్‌లో మోదీకి రసగుల్లాలు దొరుకుతాయి కానీ ఓట్లు కాదని ఆమె ఎద్దేవా చేశారు.

>
మరిన్ని వార్తలు