ఆందోళనను విరమించనున్న జూడాలు!

17 Jun, 2019 16:34 IST|Sakshi

చర్చల లైవ్‌ ప్రసారానికి ఒకే చానెల్‌ను అనుమతిస్తామని మెలిక

కోల్‌కతా: గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల ఆందోళనకు అతి త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించిన మమతా బెనర్జీ ప్రభుత్వం.. సోమవారం వారితో బహిరంగ చర్చలకు అంగీకరించారు. మీడియా సమక్షంలో జరిగే ఈ చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మమత ఓకే అన్నారు. కోల్‌కతాలోని తాత్కాలిక సచివాలయం నబన్నాలో సీఎం మమతా బెనర్జీ, జూనియర్‌ డాక్టర్ల ప్రతినిధులు చర్చలు జరిపారు.

ఈ చర్చల్లో ఆందోళన చేస్తున్న జూడాల డిమాండ్లను నెరవేర్చేందుకు సీఎం మమత అంగీకరించారు. జూడాల డిమాండ్‌ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు. దీంతో తమ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని జూడాల ప్రతినిధులు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరడంతో వారు త్వరలోనే ఆందోళనలకు స్వస్తి చెప్పి.. తిరిగి విధుల్లో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక, ఈ చర్చలకు మీడియాను అనుమతించే విషయంలో దీదీ యూటర్న్‌ తీసుకున్నారు. కేవలం ఒక్క స్థానిక మీడియా చానెల్‌ను మాత్రమే ఈ చర్చల్లో పాల్గొనేందుకు అంగీకరిస్తామని ఆమె తేల్చిచెప్పారు. దీంతో ఉత్సాహంగా చర్చలను కవర్‌ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు షాక్‌ తిన్నారు. 

>
మరిన్ని వార్తలు