సీఎంపై ఇంకు దాడి

17 May, 2018 22:42 IST|Sakshi
దేవీ భవన్‌లాల్‌ ఆలయంలో పూజలు చేస్తున్న ఖట్టర్‌

చండీగఢ్‌: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌పై ఇంకు దాడి జరిగింది. ఈ ఘటన హిస్సార్‌లో చోటుచేసుకుంది. గురువారం రోడ్‌ షోలో పాల్గొన్న ఖట్టర్‌పై ఓ యువకుడు ఇంకు పోశాడు. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి, సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డారు. తాను ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్డీ) కార్యకర్తనంటూ నినాదాలు చేస్తున్న ఆ యువకున్ని సీఎం సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

అయితే, ఘటనానంతరం ఖట్టర్‌ తన చేతి రుమాలుతో ముఖంపై పడిన ఇంకుని తుడుచుకొని రోడ్‌ షోలో పాల్గొన్నారు. అనంతరం దేవీ భవన్‌లాల్‌ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అభిమన్యుతో కలిసి పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రికే సరైన భద్రత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

‘యువకున్ని అదుపులోకి తీసుకున్నాం. అతను ఏ పార్టీకి చెందిన వాడో తెలియాల్సి ఉంది’ అని హిస్సార్‌ జిల్లా ఐజీ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రికి విలేకరులు, కెమెరామెన్‌లు దూరంగా ఉండాలని  గత సంవత్సరం సోనిపట్‌ జిల్లా యంత్రాంగం పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు