సుమోటోగా తీసుకోవాలి

4 Jan, 2020 03:57 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ

చిలకలగూడ: అణగారిన వర్గాలపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు నిరసనగా ఈ నెల 8న కొంగర కలాన్‌లో ఎస్సీ, ఎస్టీ యుద్ధభేరీ సభను నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. సికింద్రాబాద్‌ పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్‌ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆత్మకథ పుస్కకావిష్కరణ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడిన మాటలు సరికాదన్నారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థించినట్లు చేసిన వ్యాఖ్యలను సుప్రీం, హైకోర్టు, మానవ హక్కుల కమిషన్లు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ జరిపించాలన్నారు. ఎన్‌కౌంటర్‌ వెనుక మా నేత నిర్ణయం ఉందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారని, ప్రభుత్వ నిర్ణయంతోనే ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోందని, కఠిన నిర్ణయాలు చట్టానిక లోబడే చేయాలని లేకుంటే హత్యల కిందకే వస్తాయన్నారు. ఈ విషయమై మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేయనున్నట్లు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. కొంగర కలాన్‌ యుద్ధభేరీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు