టీఆర్‌ఎస్‌లో చేరిన మండవ వెంకటేశ్వరరావు

6 Apr, 2019 17:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీమంత్రి, తెలంగాణ టీడీపీ సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌...ఈ సందర్భంగా మండవకు కండువా కప్పి పార్టీలోకి ఆహ‍్వానించారు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మండవ కీలకపాత్ర పోషఙంచారు. కాగా సీఎం కేసీఆర్‌ నిన్న స్వయంగా హైదరాబాద్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. 

కాగా టీడీపీకి తెలంగాణలో ముఖ్యనేతగా ఉన్న మండవ టీఆర్‌ఎస్‌లో చేరడంతో నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో అధికార పార్టీకి బలం పెరిగినట్లు అయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణలోని ఎన్నికలలో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన కేడర్‌పై టీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టి సారించింది. టీడీపీకి చెందిన అన్ని స్థాయిల్లోని నేతలను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు మిగిలున్న కేడర్‌ మద్దతు పొందేలా వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగా మండవను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, నిజామాబాద్‌ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 

మరోవైపు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త గాయత్రి గ్రూప్ ఇండస్ట్రీస్ యజమాని గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) గులాబీ కండువా కప్పుకున్నారు. గాయత్రి రవి ఇవాళ సాయంత్రం తన అనుచరులతో కలిసి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు.  ఆయన 2018 వరంగల్‌ (తూర్పు) నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రవి పోటీ చేశారు.

మరిన్ని వార్తలు