ఇతరులూ కాంగ్రెస్‌ చీఫ్‌ కావొచ్చు

24 Jun, 2019 05:45 IST|Sakshi

సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం వారు కాకుండా ఎవరైనా అధ్యక్షుడు కావొచ్చని.. అయితే కచ్చితంగా గాంధీ కుటుంబం మాత్రం పార్టీలో చురుకుగా ఉండాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ అన్నారు. గాంధీ ముక్త్‌ కాంగ్రెస్‌ పేరుతో కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ చేయడమే బీజేపీ అసలు లక్ష్యమని ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వైఫల్యంతో పార్టీ చీఫ్‌ ఎవరనే ప్రతిష్టంభనపై అయ్యర్‌ స్పందించారు. రాహుల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉండటమే మంచిదని.. అయితే ఆయన అభిప్రాయాలను నాయకులు, కార్యకర్తలు గౌరవించాలని అభిప్రాయపడ్డారు.

గాంధీ–నెహ్రూ కుటుంబాలు అధ్యక్ష పదవిలో లేకున్నాపార్టీ మనగలుగుతుంది. క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు.. నేతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే సత్తా వారికే ఉందని చెప్పారు. నెహ్రూ–గాంధీ కుటుంబంలోని వారు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు పార్టీలో నేతల మధ్య తలెత్తిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించారో ఉదహరించారు. చీఫ్‌గా రాహులే ఉంటారా? ఇతరులు వస్తారా? అన్న దానికి వేచి చూడాల్సిందే అని అయ్యర్‌ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వైఫల్యంతో పార్టీ చీఫ్‌ పదవి నుంచి తప్పుకోవడానికి రాహుల్‌ ప్రతిపాదించగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ  తిరస్కరించింది. అయితే, చీఫ్‌గా ఎవరుండాలనేది పార్టీనే నిర్ణయిస్తుందని రాహుల్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు