సీఎంగా ఖట్టర్‌.. డిప్యూటీ సీఎం దుష్యంత్‌..

27 Oct, 2019 14:38 IST|Sakshi

చండీగఢ్‌: హరియాణ ముఖ్యమంత్రిగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వరుసగా రెండోసారి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హరియాణ గవర్నర్‌ సత్యదేవ్‌ ఖట్టర్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేజేపీ, శిరోమణి అకాలీ దళ్‌ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

90 స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్‌ (46)ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్‌ చౌతాలా కింగ్‌మేకర్‌గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా జేజేపీతో బీజేపీ అక్రమపొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది.

మరిన్ని వార్తలు