ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావ్

11 Oct, 2018 12:59 IST|Sakshi
ఆరోపణలు ఎదుర్కొంటున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు

హైదరాబాద్‌: నా మీద కేసులు ఉన్నాయని చెబుతున్నావ్‌..అవి నువ్వు(పుట్టా మధు), నీ అనుచరులు పెట్టిన కేసులేనని  మంథని మాజీ ఉప సర్పంచ్‌, పుట్టా మధు బాధితుడు సతీష్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సతీష్‌ విలేకరులతో మాట్లాడుతూ..అడవిలో ఉన్న ఎమ్మెల్యే అంటున్నావ్‌..ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావ్‌ అని పుట్టా మధుని సతీష్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాను పుట్టా మధుపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. మధు మీద ఫిర్యాదు చేసి 3 నెలలు అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని అడిగారు.

మంథనిలో ఉన్న మీడియాను తన కనుసన్నల్లో మేనేజ్‌ చేస్తున్నారని..అందుకే హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే తనకు పుట్టా మధుతో ప్రాణ హాని ఉందన్నారు. అందుకే హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నట్లు వెల్లడించారు. బీసీ ఎమ్మెల్యే ముసుగులో ఎంతో మందిని అణచివేశారని ఆరోపించారు. పుట్టా మధుపై 6 కేసులు నమోదయ్యాయని, ప్రజలందరూ చూస్తుండగానే ఎస్‌ఐపై కండువా వేశారని, అది తప్పుకాదా అని ప్రశ్నించారు.

 గుండా నాగరాజు కేసులో పుట్టా మధు ముమ్మాటికీ నిందితుడేనని, గుండా బలిదానం వల్లే పుట్టా మధు ఎమ్మెల్యే అయ్యాడని చెప్పారు. అప్పటి స్థానిక ఎస్‌ఐ వల్ల కేసు నుంచి పుట్టా మధు తప్పించుకున్నాడని, అదే ఎస్‌ఐ ఇప్పుడు మంథని సీఐగా ఉన్నాడని వెల్లడించారు. పుట్టా మధు చెబుతున్నట్లు తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పుట్టా మధుకు రూ.900 కోట్ల ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నించారు. తన  వెనక మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఉన్నారన్నది అవాస్తవమన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతికి లైసెన్స్‌ ఇస్తుందని విమర్శించారు.

మరిన్ని వార్తలు