‘ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌కు తొత్తుగా మారింది’

11 Jan, 2019 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల సంఘం అధి​కార పార్టీకి తొత్తుగా మారిందంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్‌ లిస్ట్‌లో పొరపాట్లు జరిగాయని స్వయంగా ఎన్నికల సంఘమే చెప్పిందన్నారు. మరి ఆ తప్పులకు బాధ్యులేవరు.. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారని శశిధర్‌ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి సరైన ఓటర్‌ లిస్ట్‌ తయారు చేసేంత చిత్తశుద్ధి కూడా లేదంటూ విమర్శించారు.

ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారి.. ప్రజస్వామ్యాన్ని ఫుట్‌బాల్‌ అడుకుంటుందని శశిధర్‌ రెడ్డి ఆరోపించారు. దాదాపు 30 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. క్యాబినెట్‌ సమావేశంలో ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు చెప్పడంతోనే వారి మధ్య ఉన్న బంధం ఏంటో జనాలకు బాగా అర్థమయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ఓటర్‌ లిస్ట్‌లో పొరపాట్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలోనే నంబర్‌ వన్‌గా ప్రజస్వామ్యన్ని ఎలా ఖూని చేయాలో​ కేసీఆర్‌ చూపించారంటూ మండి పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది : మల్లు రవి
సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ నుంచి వివరణ తీసుకోవాలని మల్లిఖార్జున ఖర్గే చెప్పినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలేదని మల్లు రవి ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్‌ను ఆఘమేఘాల మీద ఎందుకు ట్రాన్సఫర్‌ చేశారని ప్రశ్నించారు. రఫెల్‌ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే సీబీఐ డైరెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేశారని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రధాని స్వార్థానికి వాడుకున్నారని మండిపడ్డారు. ఆలోక్‌ వర్మను తప్పించడం వంటి చర్యలను చూస్తే ప్రజాస్వామ్యం ఎంతటి ప్రమాదంలో ఉందో అర్థమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు