దేశ ప్రధానిగా మాయావతి : బీఎస్పీ

17 Jul, 2018 10:48 IST|Sakshi
మాయావతి (ఫైల్‌ఫోటో)

లక్నో : విదేశీ మూలాలున్న సోనియా గాంధీకి జన్మించడం వల్లన రాహుల్‌ గాంధీ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం లేదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేత జై ప్రకాశ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికలపై సమీక్షించేందుకు సోమవారం పార్టీ ఉన్నత స్థాయి సమావేశాన్ని లక్నోలో నిర్వహించింది. దేశ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కంటే సోనియా గాంధీ పోలికలే రాహుల్‌కు ఎక్కువగా ఉన్నాయని అందుకే రాహుల్‌ దేశానికి ప్రధాని కాలేరని బీఎస్పీ పేర్కొంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి  విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాయావతికి ప్రకటించాలని బీఎస్పీ కోరింది.

ఉత్తర ప్రదేశ్‌కి నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించి, విశేష అనుభవం కలిగిన బీఎస్పీ అధినేత్రి మాయావతి దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అని బీఎస్సీ జాతీయ సమన్వయకర్త జై ప్రకాశ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలను  ఏదుర్కొనే శక్తి కేవలం మాయావతికే ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడం కోసం మాయావతి తీవ్రంగా కృషి చేస్తున్నారని, కర్ణాటక వేదికగా విజయం సాధించారని పార్టీ సీనియర్‌ నేత వీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న రాహుల్‌ కంటే దేశ ప్రధాని అయ్యే అర్హతలు మాయావతికే ఉన్నాయన్నారు.

అమె కేవలం దళితల పక్షపాతి కాదని దేశంలో అన్ని వర్గాల ప్రజల నుంచి మాయావతికి మద్దతు లభిస్తోందని తెలిపారు. బీఎస్పీ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్‌ బలూనీ స్పందించారు. దేశానికి నాయకత్వం వహించాలని అనుకోవడంలో తప్పలేదని,  ప్రస్తుతం లోక్‌సభలో ఒక్క సీటు కూడా లేని పార్టీ ప్రధానమంత్రి పదవి గురించి కలలు కంటోందని వ్యాఖ్యానించారు. బీఎస్పీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకూ స్పందించకపోవడం  గమనార్హం.

అవి ఆయన వ్యక్తిగత వ్యక్యలు..
రాహుల్‌ గాంధీని విదేశీ మూలాలున్న వ్యక్తిగా వర్ణించిన బీఎస్పీ వైస్‌ ప్రెసిడెంట్‌ జై ప్రకాశ్‌ సింగ్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. ఆ వ్యక్యలు ఆయన వ్యక్తిగతమైనవని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు