సాక్షి, అనంతపురం: ఎన్నికల నిబంధనలకు మేయర్ స్వరూప తూట్లు పొడిచారు. ఎన్నికల సమయంతో పోలింగ్ స్టేషన్ బయట నిలబడి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. అయితే పోలీసులు చోద్యం చూశారు తప్ప అక్కడి నుంచి ఆమెను పంపలేదు. వివరాల్లోకి వెళ్తే... గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు మేయర్ స్వరూప, ఆమె భర్త వెంకటేష్ అక్కడికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రం బయట నిలబడి వచ్చే ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఓటరుతో మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటేయాలంటూ అభ్యర్థించారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వీరిని చూసికూడా మాట మాట్లాడలేదు. మధ్యాహ్నం వరకు వారు పోలింగ్ కేంద్రం బయట హల్చల్ చేయడం కనిపించింది.