మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు

30 Mar, 2019 20:35 IST|Sakshi

కశ్మీర్‌ :  జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్‌ని భారత్‌తో కలిపి ఉంచుతున్న వంతెనని, దానిని తొలగిస్తే భారత్‌లో అంతర్భాగంగా ఉండాలా, వద్దా అనే అంశంపై ఆలోచించాల్సి ఉంటుందని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఇటీవల అరుణ్ జైట్లీ ఆర్టికల్ 35ఏ కొనసాగింపుపై పునరాలోచించాలంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మెహబూబా ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఉన్న కశ్మీర్‌ భారత్‌తో కలిసి ఉందంటే.. దానికి కేవలం ఆర్టికల్ 370నే కారణమని తెలిపారు. దాన్ని తొలగిస్తే.. భారత్‌తో కశ్మీర్‌ కలిసి ఉండే విషయంలో పునరాలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తోంది. కాగా గతంలో కూడా మెహబూబా ముఫ్తీ ఆర్టికల్ 35ఏ, అలాగే ఆర్టికల్ 370 తొలగింపు అంశంపై సీరియస్‌గానే స్పందించారు. గత సంవత్సరం కూడా ఆర్టికల్ 35ఏను తొలగిస్తే కశ్మీర్‌లో జాతీయ జెండా పట్టుకునేవారు కూడా ఉండరని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 35 ఏ జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నివసించే శాశ్వత నివాసితులకు సంబంధించిన విశేష అధికారాలు కల్పించింది.

మరిన్ని వార్తలు