బాబు.. రాయలసీమకు ఏం చేశారు?

4 Jul, 2020 18:42 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే అని హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు వందల దేశాలు అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు.  అధికారంలో ఉన్నప్పుడు బాబు అందరికీ గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు రాజధానిలోని రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారని ప్రశ్నించారు. మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడని మండిపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించిందిచచని చెప్పడానికి ఇదే దీనికి నిదర్శనం అన్నారు.విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే ఎప్పటి నుంచో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు. (‘టీడీపీ ఓడిపోవడంతో బీజేపీలో చేరారు’)

చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏం చేశాడని నిలదీశారు. ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడును అరెస్టు చేస్తే కులం రంగు పూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్డర్ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేస్తే గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ మర్డర్ కేసులో కొల్లు రవీంద్ర పాత్ర ఉందని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రాజధాని రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్‌ చెప్పారని పదేళ్లు చెల్లించే రైతులకు కౌలును రూ.15 వేలకు పెంచారని తెలిపారు. ఒకసారి రైతులు భూమి ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వ భూమే అని దానిని ప్రభుత్వం దేనికైనా ఉపయోగించుకోవచ్చు అని పేర్కొన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయిస్తే ఎందుకు అడ్డుపడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. (‘బాబు రాజకీయ జీవితం ముగింపుకు చేరుకుంది’)

మరిన్ని వార్తలు