భద్రత కల్పించాలని కోరిన మేరుగ నాగర్జున

15 Apr, 2019 13:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు, బెదిరింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ నాగార్జున తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిని నాగార్జున.. వేమూరు నియోజకవర్గంలో పోలింగ్‌ రోజున టీడీపీ నేతలు సాగించిన దాడులపై ఫిర్యాదు చేశారు. వేమూరు నియోజకవర్గంలోని బూతుమల్లి గ్రామంలో తనపై జరగిన దాడి, కార్ల ధ్వంసంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ద్వివేదిని కోరారు. ఈ భేటీ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలకు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 2+2 భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని ద్వివేదిని కోరినట్టు వెల్లడించారు.

రావికంపాడు గ్రామంలో మంత్రి నక్కా ఆనందబాబు, పోలీసులు కలిసి మహిళలపై దాడి చేసి గాయపరిచారని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీసీ కార్యకర్త ప్రేమచంద్‌ను విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారని పేర్కొన్నారు. కొల్లూరు గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ చర్లంచర్ల కనకదుర్గ ఇంటిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన మురళీకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సురేశ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు