అవన్నీ పవన్‌కు కనిపించడం లేదా: అవంతి

28 Jun, 2020 15:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ట్రాప్‌లో పడి పవన్ కల్యాణ్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాపు సోదరుల్ని చంద్రబాబు నిలువునా ముంచింది నిజం కాదా, ఆనాడు పవన్ గొంతెందుకు లేవలేదని ఆయన ప్రశ్నించారు. అవంతి మీడియాతో ఆదివారం మాట్లాడుతూ.. కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసింది నిజం కాదా? అప్పుడు పవన్‌ కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా. టీడీపీ హయాంలో కాపు సోదరులు, యువకులపై అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొట్టేయించారు. 

కాపు సోదరులు పవన్ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏడాదికి రూ.1000 కోట్ల చొప్పున 5 వేల కోట్లు ఇస్తామని కేవలం‌ రూ.1800 కోట్లు మాత్రమే ఇచ్చారు. కాపుల్ని మోసం చేశారు. దానిపై పవన్ గొంతెందుకు వినిపించలేదు. ఏడాది కాలంలోనే కాపుల అభ్యున్నతికి రూ. 4 వేల కోట్లకు పైగా సీఎం జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది. అదంతా పవన్‌ కళ్లకు కనిపించడం లేదా. వంగవీటి రంగాని హత్య చేయించిన పార్టీతో పవన్ చేతులు కలిపాడు. రంగా హత్యానంతరం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాపు కులానికి అండగా నిలిచారు. కాపుల్ని మోసం చేశారు కాబట్టే ఆనాడు, ఇప్పుడు టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు’ అని మంత్రి అవంతి పేర్కొన్నారు.
(చదవండి: నమ్మించి వీడియోలు తీసి.. లైంగిక వేధింపులు)

మరిన్ని వార్తలు