సాక్షి, విశాఖపట్నం : టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంటా ఒక రాజకీయ వ్యాపారి అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని చురకలంటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.
పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవే ముఖ్యమని అవంతి ఉద్ఘాటించారు. గెలిచిన తర్వాత నియోజకవర్గం (విశాఖ ఉత్తరం)లో కనిపించకుండా పోయిన ఎమ్మెల్యే గంటా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అవంతిని మంత్రిగా పరిగణించడంలేదన్న గంటా వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. తనతో పెట్టుకుంటే గంటా విశాఖలో తిరగలేరని మంత్రి హెచ్చరించారు.
ఇక దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని చిన బజార్, తగరపు వలసల్లో అవంతి వైఎస్సార్ విగ్రహాల్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో అవంతి పాల్గొన్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు వైఎస్సార్కు నివాళులర్పించారు.