‘బాబు రాజకీయ జీవితం ముగిసింది’

14 Feb, 2020 16:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఐటీ సోదాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ ఏం సమాధానం చెప్తారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ వద్దనే రూ. 2 వేల కోట్లు బయటపడితే.. అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో గమనించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తినేశారని విమర్శించారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులని విమర్శించిన బొత్స.. అక్రమ లావాదేవీలపై ఆయన నోరు విప్పాలని సవాలు విసిరారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందన్నారు.

శుక్రవారం విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, లోకేష్‌ బినామీలపై ఐటీ సోదాలు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్‌ సహా ఢిల్లీ, పుణెలలో కూడా సోదాలు జరిగాయి. మొత్తం 40కి పైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ భారీగా అక్రమ లావాదేవీలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచి విదేశాలకు.. అక్కడి నుంచి తిరిగి ఇండియాకు లావాదేవీలు జరిగాయని ఐటీ ప్రకటించింది. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడని మేం మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాం. రాజధాని పేరుతో టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. కాంట్రాక్ట్‌ల పేరుతో రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 

అప్పులు తెచ్చి మరీ దోచుకున్నారు..
చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారనే మేము రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాం. పేదలకు ఇళ్ల పేరుతో కూడా చంద్రబాబు అవినీతి చేశారు. ఎన్నికలకు ముందు 46వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడంతోనే చంద్రబాబు బాగోతం అర్థమైంది. రూ. 3239 కోట్ల విలువైన పనులకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తే రూ. 392 కోట్లు మిగిలాయంటే గత ప్రభుత్వ హయాంలో దోపిడీ ఏ స్థాయితో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా సుమారు రూ. 800 కోట్లు ఆదా అయింది. డొల్ల కంపెనీలతో ఏ విధంగా దోచుకోవాలని కుటుంబరావు ప్రణాళిక వేశారు. తన మాజీ పీఎస్‌ అక్రమాలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు?. చంద్రబాబు తోక పత్రికలు ఎందుకు వార్తలు రాయడం లేదు?. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట. ఈ సారి మేనేజ్‌ చేయడం కుదరలేదేమో.. మిస్‌ ఫైర్‌ అయ్యింది. రూ. లక్షా 95వేల కోట్ల అప్పు చేస్తే.. ఎక్కడెక్కడ ఖర్చు చేశారో చెప్పలేదు. అప్పులు తీసుకొచ్చి మరీ చంద్రబాబు దోచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నార’ని తెలిపారు.

చదవండి : చంద్రబాబు అవినీతి బట్టబయలు

ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు

బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు

లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది

చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో!

మరిన్ని వార్తలు