ముఖ్యమంత్రికి ‘ఇచ్ఛా మరణ’ వరముంది!

11 Aug, 2018 11:35 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను మహాభారతంలోని భీష్మ పితామహుడితో పోలుస్తూ ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజయ్‌ చంద్రకర్‌ వ్యాఖ్యలు చేశారు. భీష్ముడి తరహాలోనే రమణ్‌సింగ్‌కు ‘ఇచ్ఛా మరణ’ (కోరుకున్నప్పుడే చనిపోయే) వరముందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ముఖ్యమంత్రికి ఇచ్ఛామరణ వరముంది. భీష్మ పితామహుడి తరహాలో ఎప్పుడు ఓడిపోవాలి.. ఎప్పుడు గెలువాలన్నది ఆయనకు తెలుసు. ఛత్తీస్‌గఢ్‌ పురోగతి సాధించి.. సుసంపన్నమయ్యేవరకు తాను ఎప్పుడు ఓడిపోయేది ఆయన చెప్పబోరు’ అంటూ ఆయన శుక్రవారం ఓ సభలో పేర్కొన్నారు. ఓ పెద్ద పార్టీ నాయకుడు రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారని, ఆ పార్టీ పాలనలో రాష్ట్రం వలసలు, నిరక్షరాస్యత మాత్రమే చవిచూసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై  ఆయన విమర్శలు గుప్పించారు. రమణ్‌సింగ్‌ను భీష్మపితామహుడితో పోలుస్తూ మంత్రి అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు