మన కూరగాయలను సద్వినియోగం చేసుకోండి

23 Apr, 2018 10:41 IST|Sakshi
మార్కెటింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి హరీష్‌రావు

ఒకే స్టాల్‌ ఏర్పాటుపై మంత్రి హరీష్‌మండిపాటు

మణికొండలో మన తెలంగాణ–మన కూరగాయలు పథకం ప్రారంభం

పాల్గొన్న ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

మణికొండ: మన తెలంగాణ–మన కూరగాయల  పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవా లని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆదివారం పథకం ప్రారంభోత్సవానికి ఆయన మణికొండకు వచ్చారు. మర్రిచెట్టు సర్కిల్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రభు త్వం ప్రతిష్టా త్మకంగా అమలుచేస్తోం దని తెలిపా రు.  అనంతరం మణికొండలోని పంచవటి కాలనీ ప్రవేశంలో స్టాల్‌ను ఏర్పాటు చేయాలని కోరామని, అది అమలు కాలేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హరీష్‌రావు మార్కెటింగ్‌ శాఖ అధికారులపై మండిపడ్డారు. మణికొండలో రెండు స్టాళ్లను ఏర్పాటు చేయాలని గతంలో తాను ఆదేశించినా ఒకటే ఎందుకు సిద్ధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం ఆదేశించినా ఇప్పటివరకు ప్రక్రియ పూర్తి చేయకపోవడం ఏంటని నిలదీశారు.

సర్వేనెంబర్‌ 42లోని ప్రభుత్వ భూమిలోని కొంత స్థలాన్ని తమకు కేటాయిస్తామని తహసీల్దార్‌ చెప్పి.. ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతోనే స్టాల్‌ ఏర్పాటు చేయలేకపోయామని మార్కెట్‌ అధికారులు మంత్రికి వివరించారు. దీంతో హరీష్‌రావు.. సదరు విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు సూచించారు. పక్కనే ఉన్న ఎంపీపీ తలారి మల్లేశ్‌ కలగజేసుకుని తహసీల్దార్‌తో మాట్లాడి ప్రతిపాదనలు పంపించామని, కలెక్టర్‌ స్థలం కేటాయించాలని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే స్టాల్‌ ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మన కూరగాల పథకంలో అటు రైతులతో పాటు ఇటు కొనుగోలుదారులకు న్యాయం జరుగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపీపీ తలారి మల్లేశ్, సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, మహేందర్‌గౌడ్, మార్కెట్‌ ప్రత్యేక కార్యదర్శి పద్మహర్ష, నార్సింగి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మమతాశ్రీనివాస్, వైస్‌ చైర్మెన్‌ శ్రీరాములు తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు