ప్రజాక్షేత్రంలో బీజేపీకి పరాభవమే

12 Jul, 2018 04:44 IST|Sakshi

మంత్రి జోగు రామన్న

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాక్షేత్రంలో బీజేపీకి పరాభవం తప్పదని, మునిగిపోయే పడవ బీజేపీదేనని మంత్రి జోగు రామన్న అన్నారు. బీజేపీ నేతల మాటలు మాయల ఫకీర్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఈ మాటలను తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అధికారంలోకి వస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని లక్ష్మణ్‌కు సవాల్‌ విసిరారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన నీరవ్‌ మోదీ, విజయ్‌మాల్యా దర్జాగా విదేశాల్లో తిరుగుతున్నారని చెప్పారు. లక్ష్మణ్‌ ఇప్పటికైనా పగటి కలలు కనడం మానేసి, వాస్తవ పరిస్థితుల్లో జీవించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్ర మంత్రులు అభినందిస్తున్న విషయాన్ని గమనించాలని చెప్పారు. 

మరిన్ని వార్తలు