తీసేసిన తహశీల్దార్ దేవినేని ఉమ: కొడాలి నాని

13 Apr, 2020 19:23 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన విమర్శించారు. మంత్రి కొడాలి నాని సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. కరోనా నియంత్రణపై సీఎం జగన్‌ ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లాలో తీసేసిన తహశీల్దార్ దేవినేని ఉమ. ఎమ్మెల్యే కావడం కోసం సొంత వదినను చంపిన చరిత్ర దేవినేని ఉమది. ఉమాకు ఏ అర్హత ఉందని ఇరిగేషన్‌ మంత్రి చేశారు. ప్రజలకు కావాల్సింది విమర్శలు కాదు భరోసా.

టీడీపీ నేతలు కరోనా పోరాటంలో కలిసి రాకపోగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. రైతులకు ప్రజలకు ధైర్యం చెప్పకపోగా వారి ఆత్మస్తైర్యం దెబ్బతినేల వ్యవహరిస్తున్నారు.  రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడాలనేది టీడీపీ ఉద్దేశ్యం. ప్రజలు ఇబ్బంది పడితే రాజకీయాలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యం.  ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాది. గత ఐదేళ్లు చంద్రబాబు చేసింది ప్రచార ఆర్భాటమే. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్‌ కీలుబొమ్మ. వ్యవస్థలు బాగుపడాలంటే నిమ్మగడ్డ రమేష్‌ లాంటి వారిని తీసేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఎస్‌ఈసీగా రిటైర్డ్‌ జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించాం. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని నాటకాలాడుతున్నారు.’ అని ధ్వజమెత్తారు.

16 నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ
అంతకు ముందు మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ చేస్తామన్నారు. రెండో విడతలో 5 కేజీల బియ్యం, కేజీ శెనగలు ఇస్తామని తెలిపారు. 14వేల రేషన్‌ షాపులకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, రేషన్‌ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కూపన్ల మీద ఉన్న తేదీల్లో మాత్రమే రేషన్‌ దుకాణాల వద్దకు రావాలన్నారు. గ్రామ సచివాలయాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని, పౌర సరఫరాల శాఖ నేరుగా గ్రామాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తోందన్నారు.

>
మరిన్ని వార్తలు