తిరుగులేని పార్టీగా వైఎస్సార్‌ సీపీ

12 Mar, 2020 12:18 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, కాకినాడ: శత వసంతాల పాటు వైఎస్సార్‌ సీపీ  తిరుగులేని పార్టీగా ముందుకెళ్తుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలు వైఎస్సార్‌సీపీని ఒక చారిత్రక పార్టీగా తీర్చిదిద్దబోతున్నాయని పేర్కొన్నారు. పట్టుదల కలిగిన నాయకుడు పార్టీని నడిస్తున్నారని.. బడుగు బలహీన వర్గాల కోసం వైఎస్‌ జగన్‌ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు పది శాతం రిజర్వేషన్లు అదనంగా ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. దేశంలోనే ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.(వైఎస్సార్‌ సీపీ ప్రజల పక్షం: సజ్జల)

చంద్రబాబుకు మరోక ఆలోచన ఉండదు..
యజ్ఞాన్ని ఎలా భగ్నం చేయాలన్న ఆలోచనే తప్ప.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరోక మంచి ఆలోచన ఉండదని దుయ్యబట్టారు. విజయవాడ ఎన్నికలు వదిలేసి మాచర్ల వరకు బోండా ఉమా వంటి నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అలజడి సృష్టించడం ద్వారా  సమస్య ఉత్పన్నం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసే గిల్లుడు కార్యక్రమం ఎవరికి కనిపించదని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదన్నారు. బలవంతంగా ఎవర్నో ఒకరిని పెట్టాల్సిన పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందన్నారు. అపవిత్రమైన పొత్తులతో చంద్రబాబులా దిక్కుమాలిన రాజకీయాలు ఎవరైనా చేస్తారా అంటూ కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ప్రజామోదం,అభిమానం సీఎం జగన్‌కు మెండుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
(హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దే..)

మరిన్ని వార్తలు