సీఎం చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి

5 Jan, 2018 20:49 IST|Sakshi

సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పుదుచ్చేరి మంత్రి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మండిపడ్డారు. విశాఖలో మత్సకారులపై అసహనంతో మండిపడ్డ చంద్రబాబుపై మల్లాడి విమర్శలు గుప్పించారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులపై మండిపడటానికి చంద్రబాబు ఎవరంటూ ప్రశ్నించారు. తక్షణమే మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. యాభై సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు ఫించన్లు, బ్యాన్‌ పిరియడ్‌ రిలీఫ్‌ ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఎందుకు ఇవ్వలేందంటూ ప్రశ్నించారు.

ఎన్నికల్లో గెలవడానికి మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పిన బాబు.. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎందుకు చేర్చలేదో వివరణ ఇవ్వాలని మల్లాడి డిమాండ్‌ చేశారు. గత కాంగ్రెస్‌ పాలనలో నలుగురు మత్స్యకారులని గెలిపించుకొని, ఒకరికి మంత్రి పదవి, మరో ఇద్దరు మత్స్యకార మహిళలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలంటూ చురకలంటించారు.

మరిన్ని వార్తలు