ఆ భవనాలను తొలగిస్తాం: మంత్రి నారాయణ

17 Nov, 2017 19:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తీర్పును అనుసరించి రాజధాని అమరావతి నిర్మాణం సాగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణానికి ఎన్జీటీ శుక్రవారం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. నదికి వంద మీటర్లలోపు ఉన్న భవనాలన్నింటినీ తొలగిస్తామని నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు ఈ పరిధిలోకి వస్తుందో, లేదో చూడాలన్నారు. సీఎం ఇల్లు వంద మీటర్లలోపు ఉంటే తొలగిస్తామని స్పష్టం చేశారు.

ఎన్జీటీ నుంచి రాజధానికి అనుమతులు రావడం సంతోషంగా ఉందన్నారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాజధానికి అడ్డంకులు తొలగి పోయాయని, పర్యావరణ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. స్టార్టప్ ఏరియాలో 1691 ఎకరాల్లో ప్లాట్లు చేసి అమ్ముతామని, దీన్ని మూడు విడతల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరావతి కాపిటల్ సిటీలో 1600 కిలోమీటర్ల రహదారులకు 1100 కిలోమీటర్ల టెండర్లు పూర్తి అయ్యాయని, 12 నెలల్లో రోడ్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.

మరిన్ని వార్తలు