టీడీపీది శునకానందం: పేర్ని నాని

27 Jan, 2020 14:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలను చంద్రబాబు, లోకేష్‌లు అడ్డుకుంటున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక బిల్లులను అడ్డుకుని టీడీపీ శునకానందం పొందుతుందని మండిపడ్డారు. ‘40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడటం ఆయనకు అలవాటు లేదని’  పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘రాష్ట్రాన్ని విడగొట్టాలని లేఖ ఇస్తారు.. రాష్ట్రాన్ని ఎలా విడగొడతారని ప్రశ్నిస్తారు.. బీజేపీ మతతత్వ పార్టీ అంటారు.. అదే బీజేపీతో పొత్తు అంటారు’ అంటూ టీడీపీ తీరును దుయ్యబట్టారు. రాష్ట్రానికి హోదా అవసరమని చెప్పి ప్యాకేజీని స్వాగతించారని.. ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యూటర్న్‌ తీసుకుంటారని విమర్శించారు. ‘ఎన్నికల ముందు మోదీ, అమిత్‌షాను చంద్రబాబు తిట్టారని..ఇప్పుడు వాళ్లిద్దరు మా వెనుక ఉన్నారని ఆయన చెబుతున్నారని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిచ్చామంటున్న చంద్రబాబుకు గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయని’ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో నిర్లక్ష్యానికి గురైన కొల్లేరు పరిరక్షణ కోసం రూ.350 కోట్లతో రెగ్యులేటర్ల ఏర్పాటుకు సీఎం జగన్‌ హామీ ఇచ్చారని పేర్ని నాని పేర్కొన్నారు.

(చదవండి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుకు కేబినెట్‌ నిర్ణయం)

మరిన్ని వార్తలు