‘విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించను’

7 Aug, 2019 14:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి  వనిత స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి మహిళా  శిశు సంక్షేమశాఖ సమీక్షా సమావేశం బుధవారంఅమరావతిలో నిర్వహించారు. ఈ కార్యక్రామంలో మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట‍్లాడుతూ.. విధుల్లో ఉన్న ఉద్యోగులు నిర్లిప్తత విడాలని, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఫలితాలలు సాధించగలుగుతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత సమాజానికి కృషిచేస్తున్నారని, దానికనుగుణంగా ప్రతి ఒక్కరూ స్నేహపూర్వక విధానంలో పనిచేయాలని కోరారు. మనది అనే భావన ఉంటేనే ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలమని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని, దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉందని తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో కొంతమంది సిబ్బందిని క్షేత్రస్థాయిలోని వారు వేధింపులకు గురిచేస్తున్నారనే వార్త తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని ఉపేక్షింనని హెచ్చరించారు. మహిళలు, శిశు సంక్షేమం కోసం కృషిచేసే శాఖ తమదని పునరుద్ఘాటించారు. సమన్వయ శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పౌష్టికాహార ఆవశ్యకతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. పనితీరు మెరుగుపర్చుకొని, పలువురికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. 

మరిన్ని వార్తలు