ఆ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి: వెల్లంపల్లి

18 Mar, 2020 20:47 IST|Sakshi

సాక్షి, అమరావతి : ‘వెల్లంపల్లి- ఊసరవెల్లి​’ అంటూ బీజేపీ చేసిన ట్వీట్‌కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మించిన రాజకీయ ఊసరవెల్లి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగు వేళ్లు నీ వైపు చూపిస్తాయన్న విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీటర్‌ వేదికగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుపడ్డారు.

‘2009లో మంత్రిగా పనిచేసి..2014లో బీజేపీలో చేరి..2018లో వైఎస్సార్‌సీపీలోకి చేరడానికి సర్వం సిద్ధం చేసుకొని గుండెపోటు డ్రామాలత్బో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకున్న మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కంటే రాజకీయ ఊసరవెల్లి ఎవరైనా ఉంటారా? గోదావరి-కృష్ణా పుష్కరాలలో వేల కోట్లను దోచి, వందల దేవాలయాలను కూల్చిన మీకు, మీ పార్టీ అధ్యక్షుడు కన్నాకు హిందూ దేవాలయాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అమరేశ్వరం ఆలయానికి చెందిన భూములను భూబకాసురుల నుంచి కాపాడింది అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారే. దేవాలయ భూములు పరిరక్షణ విషయంతో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దేవుడిని, హిందూ ధర్మాన్ని ఓట్ల రాజకీయం కోసం వాడుకునే మీకు దేవుడు తగిన శిక్ష వేస్తాడు’ అని మంత్రి వెల్లంపల్లి ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు