విమర్శలు చేస్తున్నవారి బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు?

12 Nov, 2019 17:59 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రతి పేదవాడి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి.. వారికి మంచి భవిష్యత్తు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘీక సంక్షేమ మంత్రి విశ్వరూప్‌ అన్నారు.నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలలో సమూలమైన మార్పులను తీసుకొస్తామని చెప్పారు. మంగళవారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. మూడు దశల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క పేదవాడు తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజకీయాల కోసమే టీడీపీ అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 

భాష వేరు బోధనా మాద్యమం వేరు
ఐదేళ్ల కాలంలో దశల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెడుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియంపై విమర్శలు చేస్తున్నవారు తమ బిడ్డలను ఎక్కడ చదివిస్తున్నారో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. భాష వేరు బోధనా మాద్యమం వేరని తెలిపారు. రాజకీయాల కోసమే టీడీపీ చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని వదిలివేసి కమీషన్ల కోసం పని చేశారని ఆరోపించారు. మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారన్నారు. నాడు నేడు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు