డీఎంకేలో తిరుగుబాటు!

13 Aug, 2018 12:47 IST|Sakshi
అళిగిరి-స్టాలిన్‌ (ఫైల్‌ ఫోటో)

అసలైన డీఎంకే కార్యకర్తలు నా వెంటే ఉన్నారు

సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంకే అళిగిరి

సాక్షి, చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో మరో తిరుగుబాటుకు తెరలేచింది. డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో పార్టీలో ఆయన కుమారుల మధ్య వారసత్వ పోరు ప్రారంభమైంది. తాజాగా ఆయన కుమారుడు, మాజీ కేంద్రమంత్రి ఎంకే అళగిరి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వారసుల గురించి కరుణానిధి ఏమన్నారో తనకు తెలియదని, ప్రస్తుతం నిజమైన డీఎంకే కార్యకర్తలందరూ తన వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీని నడిపించడానికి తానే సరైన నాయకుడినని చెప్పుకొచ్చారు. స్టాలిన్‌ కేవలం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాత్రమేనని, కానీ ఆయన పని (వర్కింగ్‌) చేయడం లేదని విమర్శించారు.

కరుణానిధి మరణంతో డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 14న డీఎంకే కార్యవర్గ సమావేశంలో స్టాలిక్‌కు పట్టాభిషేకం చేయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అళగిరి వ్యాఖ్యాలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో కూడా అళగిరి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ నాయకుడు కరుణానిధి మాత్రమేనని, స్టాలిన్‌ను నాన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆ‍యన వర్ణించారు. పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్నారంటూ అళగిరిని 2014 లోక్‌సభ ఎన్నికల ముందు కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అళగిరి బహిష్కరణ కుడా ఒక కారణమని పార్టీలోని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి తిరిగి పుర్వవైభవం తెచ్చేందుకు అళగిరిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని గతంలో స్టాలిన్‌ భావించారు. దీనికి స్టాలిన్‌ వర్గంలోని కొందరు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్టాలిన్‌ వెనుకడుగువేశారు. ప్రస్తుతం అళగిరి వ్యవహర శైలిని డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. కరుణానిధి అంత్యక్రియలు సందర్భంగా అళగిరితో బీజేపీ తమిళనాడు ఇన్‌ఛార్జ్‌ మురళీధర్‌రావు 40 నిమిషాల పాటు ముచ్చటించిన విషయం తెలిసిందే. అదే అంశం డీఎంకే శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతోంది. దీంతో స్టాలిన్‌ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు.

స్టాలిన్‌కు పట్టాభిషేకం

మరిన్ని వార్తలు