ఎమ్మెల్యేను తిరగనీయం అంటే సామాన్యుల సంగతేంటి?

8 Jul, 2018 19:16 IST|Sakshi

సాక్షి, కర్నూలు : ఓ ఎమ్మెల్యేను డోన్‌ పట్టణంలో తిరగనీయం అంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత కేఈ ప్రతాప్‌ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేనే తిరగనీయం అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు.

జిల్లాలోని ప్యాపిలిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ప్రజలకు లోన్లు, పింఛన్లు, ఇళ్ల కోసం ప్రభుత్వ సొమ్మును ఇవ్వడానికి కూడా తెలుగుదేశం నాయకులు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా వారి సొంత సొమ్మును ప్రజలకు ఏమైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. డోన్‌లో తిరగనీయం అంటున్న కేఈ ప్రతాప్‌ 2009 నుంచి 2014 వరకూ ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, అప్పుడు తుంగభద్రను దాటి ఇవతలకి ఎందుకు రాలేదని నిలదీశారు.

అధికారం ఉందనే కండకావరంతో టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.

మరిన్ని వార్తలు