సాక్షి, శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ లీగల్ నోటీసులు పంపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పలాసలో తాను అవినీతికి పాల్పడినట్లు పవన్ చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా తన కుటుంబంపై పవన్ విమర్శలు చేశారని దానికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా కాశీబుగ్గలో మంగళవారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ పలాస ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని, పలాస ప్రజలకు అల్లుడు టాక్స్ పడుతోందని ఆరోపించిన విషయం తెలిసిందే. ‘ఇటీవల జీఎస్టీ విన్నాం.. కాని పలాసలో మాత్రం అదనంగా అల్లుడు టాక్స్ కట్టాలట’ అని పవన్ అన్న మాటలపై శివాజీ మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పసుపు నీళ్లతో శుద్ది
కాశీబుగ్గలో నిన్న జరిగిన పవన్ కల్యాణ్ బహిరంగ సభా ప్రాంగణాన్ని టీడీపీ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్దిచేశారు. పవన్ రాకతో సభా ప్రాంగణం అపవిత్రం అయ్యిందని అందుకే పసుపు నీళ్లతో శుద్దిచేశామని టీడీపీ కార్యకర్తలు చెప్పారు. కాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలకు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ నిన్నటి సభలో ఆరోపించిన సంగతి తెలిసిందే