ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: భవన నిర్మాణ కార్మికులపై పవన్కల్యాణ్ కపటప్రేమ చూపిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అసలు లాంగ్ మార్చ్ అనే పదానికి పవన్కల్యాణ్కు అర్థం తెలుసా అని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ నేత మావో ప్రపంచం కోసం చేసిన పదివేల కిలోమీటర్ల మార్చ్ను కీర్తిస్తూ పెట్టిన పేరు లాంగ్ మార్చ్ అని పేర్కొన్నారు. లాంగ్మార్చ్లో పవన్ రెండు కిలోమీటర్లు కూడా నడవలేకపోయారన్నారు. పవన్ చేసింది లాంగ్మార్చ్ కాదని..వెహికల్ మార్చ్ అని ఎద్దేవా చేశారు. ఇసుక మాఫియా అచ్చెన్న, డ్రగ్ మాఫియా అయ్యన్నలను చెరో వైపు పెట్టుకుని పవన్ వేదాలు వల్లించారని ఆక్షేపించారు.
టీడీపీ నేతల దోపిడీకి పవన్ వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి గడువు ఇవ్వడానికి మీరెవరని ప్రశ్నించారు. ప్రజలు..చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చినా పవన్కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. సినిమా డైరెక్టర్లు, నిర్మాతలకు డేట్లు ఇచ్చి వారిని రోడ్డున పడేసి..నారా వారి బ్యానర్లో పవన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లాంగ్మార్చ్లో భవన కార్మికులు ఎక్కడా కనిపించలేదని..వారికి ఇసుకపై వాస్తవాలు తెలుసునన్నారు. ఇసుకను జాతీయ సమస్యగా చూపి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయొద్దంటూ హితవు పలికారు. తప్పుడు నాటకాలను ప్రజలు విశ్వసించరన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి ఉన్న నాయకుడని..నిత్యం ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలనే తపనతో పనిచేస్తున్నారని అమర్నాథ్ పేర్కొన్నారు.