టీడీపీని ప్రజలు నమ్మరు 

4 Jul, 2018 09:16 IST|Sakshi
  మాట్లాడుతున్న ఎమ్మెలే గుమ్మనూరు జయరాం

హాలహర్వి: గత ఎన్నికల్లో లేనిపోని హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఈసారి ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు విరక్తి  పుట్టిందన్నారు.  మంగళవారం సిద్ధాపురం, గూళ్యం గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  సీఎం   ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిని పూర్తిగా మరిచారన్నారు. వేదావతి నదిపై  ప్రాజెక్టు నిర్మాణానికి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేస్తామని   2016లో  ప్రకటించిన బాబు ఇంతవరకు పైసా మంజూరు చేయలేదన్నారు. ఇప్పటి వరకు సర్వే పనులు కూడా జరగలేదన్నారు.

ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నియోజకవర్గంలోని వెయ్యి ఎకరాలకు సాగునీరు, వంద గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి సొంత నిధులతోనే సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.  రైతుల కోసం పోరాటం చేసి హంద్రీనీవా నుంచి కేసీ కెనాల్‌కు  సాగునీరు అందించానన్నారు.  ఉక్కు ఫ్యాక్టరీ కోసం  సీఎం రమేష్‌ కడపలో చేపట్టిన దీక్ష  ఓ డ్రామా అని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందుకు  లేనిపోని దీక్షలు, హామీలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. హంద్రీనీవా కాలువకు తూం ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక టీడీపీ నాయకులు చేపట్టిన దీక్షలు ఒట్టి నాటకమేనని ఆరోపించారు. రైతులపై ప్రేమ ఉంటే గత నాలుగేళ్లుగా తూముల ఏర్పాటు విషయం గుర్తుకు రాలేదా అని   ప్రశ్నించారు.  అనంతరం   సిద్ధాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు