సాక్షి, కర్నూల్ : ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడితే టీడీపీ నాయకులు ఎందుకు ఉల్కిపడుతున్నారంటూ నందికోట్కూర్ ఎమ్మెల్యే ఐజయ్య ప్రశ్నించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ మళ్లీ టీడీపీతో జతకడుతున్నాడని ఆరోపించారు.
ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్ ఫ్రంట్ : కాటసాని
తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని, కేటీఆర్ కలిస్తే తప్పేంటని వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాం భూపాల్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్ ఫ్రంట్తో జతకడుతున్నామని తెలిపారు. సినిమాల కోసం బాలకృష్ట, పవన్ కళ్యాణ్లు కేసీఆర్ను కలిస్తే తప్పు లేనప్పుడు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్, కేటీఆర్ను కలిస్తే మాత్రం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు.